Wednesday, November 27, 2019
నిజామా? అబద్దమా ?
రంగాపురం జమీందారుకి తాతముత్తాతలు కూడబెట్టిన ఆస్తి బోలెడంత ఉంది. ఆయనకు పందేలు కాయడమంటే తెగ ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక విచిత్రమైన పందెం కట్టి ఎదుటివాళ్లను ఓడించేవాడు. ఎవరైనా గెలిస్తే మాత్రం వారికి బహుమతులు ఇచ్చేవాడు.
ఓ రోజు జమీందారు ఇంటికి స్నేహితులు వచ్చారు. కాసేపు అంతా సరదాగా మాట్లాడుకున్నారు. అంతలో మిత్రుల్ని ఉద్దేశించి ‘మీలో ఎవరైనా సరే ఒక అబద్ధం చెప్పి అది నిజమని నన్ను నమ్మించగలిగితే పది ఎకరాల భూమి రాసిస్తా. లేని పక్షంలో ఈ ఏడాది మీ పొలంలో పండిన పంటంతా ఇచ్చేయాలి. ఇది షరతు’ అన్నాడు జమీందారు.
చెప్పేది అబద్ధమని ముందే తెలుసు కాబట్టి ఆయన ఎలాగూ నమ్మడు. ప్రయత్నించి విఫలమైతే ఈ ఏడాది పంటా దక్కదు. అవసరమా?’ అనుకుని ఎవరూ మాట్లాడలేదు.
ఇంత చిన్న పందేనికి మీలో ఎవరూ ముందుకు రాలేరా?’ సవాలుగా అన్నాడు జమీందారు.
వారిలో రామయ్య అందుకుని ‘మిత్రమా! నేను ఇప్పుడే ఒక అబద్ధం చెప్పి దాన్ని నిజమని నమ్మించగలను’ అన్నాడు.
ఆలస్యమెందుకు రామయ్యా! ఆ అబద్ధం ఏంటో వెంటనే చెప్పి నన్ను నమ్మించు’ అన్నాడు జమీందారు ఉత్సాహంగా.
అప్పుడు రామయ్య ‘నువ్వు నాకు పదెకరాల భూమిని రాసిస్తున్నావు. ఈ మాట అబద్ధం’ అన్నాడు.
జమీందారు చప్పున ‘ఔను’ అనేశాడు. వెంటనే ఆలోచనలో పడ్డాడు.
రామయ్య చెప్పిన అబద్ధాన్ని తాను నిజమని ఒప్పుకున్నాడు కాబట్టి పందెంలో తను ఓడిపోయినట్టే.
ఒకవేళ మాట మార్చి ‘లేదు’ అంటే భూమిని రాసివ్వాల్సి ఉంటుంది. ఏరకంగా చూసినా తాను రామయ్యకు భూమిని రాసివ్వాల్సిందే!
ఇరకాటంలో పడిపోయిన జమీందారు చివరకు తన ఓటమి ఒప్పుకోక తప్పలేదు.
రామయ్య తెలివితేటల్ని అందరూ మెచ్చుకున్నారు.
Wednesday, November 20, 2019
అత్యాశ
ఒక మానవుడు విచారంగా కుర్చుని బాధపడుతున్నాడు . అటు వైపు వచ్చిన ఓ సన్యాసీ అతడి దుఃఖం కి కారణం తెలుసుకోవాలనుకున్నాడు .
సన్యాసీ :- ఓ మానవా ! ఏమిటి నీ బాధ ?
మానవుడు :- జీవితం లో సంతోషమే లేదు స్వామి .
వెంటనే ఆ సన్యాసీ తన చూపుడు వేలును అక్కడున్న రాయికేసి చాచాడు .
ఆ రాయి బంగారు రాయి గా మారిపోయింది .
సన్యాసీ :- ఇప్పుడు సంతోషమేన ?
మానవుడు :- ఆఆ ...అదొక రాయే కదా !
ఈ సారి తన చూపుడు వేలుతో ప్రక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టు గా మార్చేసాడు .
సన్యాసీ :- ఇప్పుడేమంటావు ?
మానవుడు :- అదొక చెట్టే కదా !
మల్లి చూపుడు వేలును ఇంటివైపు చూపించాడు . ఇల్లు బంగారు ఇల్లు గా మారిపోయింది .
సన్యాసీ :- ఇది చాలా ?
మానవుడు :- అదొక ఇల్లే కదా !
సన్యాసీ :- ఇంత బంగారాన్నిచినా నీకు సంతోషం కలగలేదే ! అయితే నీకేం కావాలి ?
మానవుడు :- నీ చూపుడు వేలు కావాలి స్వామి .!
😳😳😃😃😃😆😆
Tuesday, November 19, 2019
ఏడు చేపల కథ
Friday, November 1, 2019
తాతల గొప్పలు
చింతలగూడెంలో పనీపాటా లేని ముగ్గురు కోతలరాయుళ్లు ఉండేవారు. రోజూ మధ్యాహ్నం వేళకల్లా రచ్చబండ దగ్గర చేరి పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. దారిన పోయే వారిని ఎలాగోలా మాటల్లోకి దింపి గేలి చేస్తుండేవారు. ముగ్గురూ రి ప్రముఖుల బంధువులు కావడంతో ఎవరూ ఏమనలేక మిన్నకుండేవారు. ఓ రోజు రంగయ్య అనే రైతు పొలానికి వెళుతుంటే ముగ్గురు స్నేహితులూ పనికట్టుకుని పలకరించి, ఏం రంగయ్యా! ఏనాడూ మాతో మాట్లాడవు. అంత పొగరేంటోయ్ నీకు?’ అన్నారు వెకిలిగా నవ్వుతూ. తాతల నాటి నుంచి మట్టి మనుషులం బాబూ! మాకు పొగరేంటి?’ అంటూ వెళ్లబోయాడు రంగయ్య. స్నేహితుల్లో ఒకడు నవ్వుతూ, మీరంతా మట్టి మనుషులైతే అయ్యారు కానీ, మా తాతల గొప్ప తనం గురించైనా వినకుండా వెళితే ఎలా?’ అన్నాడు. చేసేది లేక రంగయ్య, సరే... చెప్పండయ్యా...’ అన్నాడు. మా తాత భలే ధైర్యశాలి తెలుసా? ఓసారి పందెం కాసి అమావాస్యనాడు శ్మశానంలో రాత్రంతా గడిపి వేయి వరహాలు బహుమతి పొందాడు’ అన్నాడొకడు. రెండోవాడు అందుకుని ఖమా తాత మహా పరాక్రమవంతుడు. ఒట్టి చేతులతో ఒంటరిగా పెద్ద పులిని చంపాడు’ అన్నాడు గొప్పగా. ఇక మూడోవాడు, మా తాత మహాకవి. ఓసారి ఆయన రాజుగారికి ఒక పద్యం చెప్పి సన్మానం పొందాడు’ అని చెప్పాడు. వీళ్ల గొప్పలు భరించలేని రంగయ్య, పొండి బాబూ! మీకు తెలియని సంగతొకటి నేను చెబుతా వినండి. మా తాత, మీ తాతలు స్నేహితులు. మీ తాత పందెం వేసి బిక్కమొహం వేస్తే రాత్రంతా శ్మశానంలో సాయం వున్నది మా తాతయ్యే. ఇక మా తాత పులిని చంపితే మీ తాతయ్య మా తాతయ్యని బతిమలాడుకుని వాళ్లతో తానే చంపినట్టు చెప్పుకున్నాడు. ఇక మా తాత రాసిచ్చిన పద్యాన్నే మీ తాత రాజుగారి దగ్గర చదివి సన్మానం పొందాడు. స్నేహితులంటే మా తాతకి అంత అభిమానం మరి!’ అన్నాడు. ఆ మాటలకు అక్కడ మూగినవారంతా పకపకా నవ్వారు. కోతల రాయుళ్లు ముగ్గురూ మొహం ముడుచుకుని చక్కా పోయారు!
Thursday, October 10, 2019
"ఉత్తమ వధువు"
"ఉత్తమ వధువు"
.............................
(నాకు నచ్చిన కధ)
ఒక వర్తకుడికి ఏడుగురు కుమారులు. ఆరుగురికి వివాహమైనది. కోడళ్లతో సమిష్టి కుటుంబం సజావుగా సాగిపోతూ వున్నది. ఇప్పుడు ఏడవ వానికీ పెళ్లి జరిగి నూతన వధువు ఈ ఇంట ప్రవేశించినది.
ఇంతవరకూ ఇంటిలో ఆరుగురు తోటి కోడళ్లు ఉదయం సాయంత్రం వంతులు వేసుకుని వంటలు చేస్తూ
వున్నారు. ఎవరైనా సుస్తీపడితే-
" నా వంతు వచ్చినప్పుడు నీవు
వంట చేయలేదు కదా! మరి నీ వంతప్పుడునేనెందుకు చేయాలి?"
ఇలాంటి చిన్నచిన్న తగాదాలు ఈ ఇంట్లో మామూలైపోయాయి..
సరే! కొత్త కోడలుఇంట్లోకి ప్రవేశించిన మొదటిరోజే చకచకా
వంటగదిలోకి వచ్చేసింది. అత్త అన్నది.
" ఇక్కడ ఆరుగురు కోడళ్లు వున్నారు. నీవిప్పుడే వంటగదిలోకి రావద్దు"
చిన్నకోడలన్నది. " అత్తగారూ! ఆకలితో అతిధి ఇంటికి వస్తే మనం
ఏం చేస్తున్నాము? శుభ్రంగా అన్నం పెడుతున్నాము కదా! దానివలన మనకు పుణ్యం కలుగుతున్నది. ఒక్కరికి అన్నం పెట్టినందుకే ఇంత
పుణ్యం వస్తుంటే, మరి ఇంట్లో వాళ్లందరకూ వండి వడ్డిస్తే ఇంకెంత పుణ్యం రావాలి!ఇల్లు మీది,బియ్యం
మీవి,ఇంట్లో పాత్రలు మీవి. వంట పదార్థాలన్నీ మీవే! నేను కొంచెం పరిశ్రమ చేసి వంట చేసి పెడితే నాకు పుణ్యం వస్తుందా రాదా? అందరూ తిని తృప్తిపడతారు, సంతోషిస్తారు. కాబట్టి అత్తయ్యా! మీరు అలా కూర్చోండి,నేనే వంట చేస్తాను."
అత్త మనసులో అనుకున్నది.
" చిన్న కోడలు బాగా చెబుతున్నది.
అందరికన్నా చిన్నది అనుకున్నాను.
ఈమె బుద్ధి మంచిది."
మరునాడు తెల్లవారింది. అత్త ఉదయమే వంటగదిలోకి చొరబడి
వంట చేయడానికి కూర్చున్నది. కోడళ్లు అది చూసి " అయ్యో! అత్తగారూ! మేమంతా లేమా! మీరెందుకు శ్రమపడడం, లేవండి! లేవండి" అనగానే అత్త అన్నది.
" మీరు చిన్నవాళ్లు,నేను పెద్దదాన్ని.
నేను త్వరలో మరణించవలసి వుంది. నేనిప్పుడు పుణ్యం చేసుకొన
కుంటే మరెప్పుడు చేసుకుంటాను?
నా ఇంటిపని నేను చేసుకోవడం పాపమేమీ కాదు కదా! అదీకాక ఈ మాత్రం శ్రమ చేస్తే నా ఆరోగ్యంకూడా
బాగుంటుంది."
నిన్న చిన్నకోడలు,ఇవాళ అత్తగారు
ఇలా మాట్లాడుతూంటే కోడళ్లందరికీ లోపల ఉత్సాహం కలిగింది.
" ఈ విషయం మనం ఊహించనే లేదు. మన ఇంటి పని మనం చేసుకుని, వంట చేసి అందరకూ
పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది."
ఇక ఇప్పుడు ఏ కోడలు ముందు లేస్తే ఆమే వంటగదిలోకి జొరబడి పొయ్యి వెలిగించి కాయగూరలు తరగడం మొదలుపెడుతున్నారు. నేను ముందు,నేను ముందు అని తగవులు వస్తున్నాయి. ఇంటి యజమాని ఇది గమనించి "అందరూ వంతులు వేసుకుని ఆ ప్రకారం వంట చేయండి." అన్నాడు.
ఒకప్పుడేమో! 'ఇవాళ వంట నీ వంతంటే నీది' అని వాదులాడుకునే
వారు.ఇప్పుడేమో ఇవాళవంట'నేను
చేస్తానంటే నేను చేస్తాననే' భావాలు
వీరిమనస్సుల్లోఏర్పడ్డాయి. కొత్త కోడలు కొంచెంఅసంతృప్తిగావున్నది.
'తన వంతు నాలుగైదు రోజులకో
మారు వస్తున్నది. ఈ ఖాళీ సమయంలో ఏంచెయ్యను' అని ఆలోచిస్తూ ఉండగా ఆమె దృష్టి మూలనున్న తిరగలిపై పడింది. దివ్యమైన ఆలోచన వచ్చింది.
మరునాడు తిరగలిని తన గది
లోకి మార్చుకుని పిండి విసరడం మొదలుపెట్టింది. అత్త ఇది గమనించింది.
"ఏమే! చిన్న కోడలా! నీవు పిండి ఎందుకు విసురుతున్నావు? మన దగ్గర డబ్బుకేమీ లోటు లేదు కదా! భగవంతుడు చాలానే ఇచ్చాడు."
ఆమె ఇలా జవాబిచ్చింది.
" అత్తయ్యా! మనకు డబ్బు చాలా వుండవచ్చుగాక! కాని నన్ను ఈ పని వద్దని మాత్రం చెప్పకండి. పిండి రోజువారీ విసురుతూనే వుంటాను. ఇలా చేతితో పిండి విసరడం వలన
శరీరం సరిగా వుంటుంది.
వ్యాయామం కూడా దానంతట అదే
అవుతుంది. జబ్బులు రావు. పదే
పదే వైద్యులవద్దకు పోనక్కరలేదు.
అదీ కాక వంట చేసిన దానికంటె కూడా ఎక్కువ పుణ్యం ఈ పని వల్ల లభిస్తుంది. వంట ఎవరైనా చేస్తారు!
పిండి మాత్రం నేను విసిరినదే అంతా తింటారు."
అత్త, ఆరుగురు కోడళ్ళు ఈ మాటలు శ్రద్ధగా విన్నారు. 'ఈమె సరిగానే చెబుతున్నది' అను
కున్నారు. వారు తమతమ భర్తలతో
"ఇంటికి తిరగలి కొని తెండి. నేను రేపటినుండి పిండి విసరాలి" అని చెప్పుకుని తిరగళ్లు తెప్పించు కున్నారు. అందరూ రోజువారీ
రెండున్నర కేజీలదాకా పిండి విసురుతున్నారు.ఇంట్లో పిండి
పేరుకుపోతున్నది. వెంటనే కొత్త కోడలు పిండిని సంచుల్లో సర్ది దుకాణంలో పెట్టి అమ్మించేసింది. బాగా లాభం వచ్చింది. అందరికీ ఆనందమైంది.
కొత్త కోడలు 'ఇంకా ఏంచెయ్యాలి?'
అని ఆలోచిస్తున్నది. 'ఇంటి వెనుక
నుయ్యి వున్నది. రోజూ నౌకరువచ్చి
తొట్టెలోనికి నీళ్లు తోడుతుంటాడు.'
ఈమె మరునాడు త్వరత్వరగా స్నానపానాదులు ముగించుకుని నుయ్యి దగ్గరకు చేరుకున్నది. చేద తీసుకుని నీళ్లన్నీ తోడి తొట్టెలో నింపింది. కొంచెం మొక్కలకు పోసింది. నౌకరు వచ్చాడు. వాడికి పనిలేకుండా పోయింది. ఖాళీగా కూర్చున్నాడు. విషయం పెద్దవాళ్ల
దృష్టికి వెళ్లింది. అత్త వచ్చినది.
" ఏమ్మా! చిన్న కోడలా! "నీవు గాని నీళ్లు తోడావా ?"
"అత్తయ్యా!మీరేమీమాట్లాడకుండా
వుండండి. మీరేమైనా మాట్లాడితే నా పుణ్య సంపాదన ఆగిపోతుంది.
మీరు వైశాఖ మహత్మ్యం విన్నారా లేదా? వైశాఖ మాసంలో మంచి
నీళ్లివ్వడానికి సంబంధించి గొప్ప కథ వున్నది. నీళ్లిస్తే వచ్చేంత పుణ్యం- అన్నం పెట్టినందుకు లేదు. ఎందుకంటే అన్నం రోజుకు ఒకటి రెండు పర్యాయాలే కదా తింటాము!
కాని నీళ్లు- నీళ్లు ప్రతిరోజూ అనేకసార్లు త్రాగుతాము. నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కుంటాం,
ముఖం శుభ్రం చేసుకుంటాం, స్నానం చేస్తాం ఇలా నీరు చాలా ఉపయోగపడుతుంది. "
మర్నాడు అత్త పెందలకడనే లేచి
నుయ్యి దగ్గరకు వెళ్లి నీళ్లు తోడి తొట్టిలో వేయసాగింది. కోడళ్లందరూ
హడావిడిగాఅక్కడకుచేరుకున్నారు.
"అత్తగారూ! మీరు చేసేదేమన్నా బాగున్నదా? మేమింతమంది వుండగా మీరు ఈ నూతి దగ్గరకు రావడమేమిటి? "
"మీరేమీ ప్రశ్నించకండి! నేను పెద్దదాన్నయ్యాను. అందువల్ల తొందరగా పుణ్యం సంపాదించు
కోవాలి. మీరైతే వెనుకనైనా చేసుకోవచ్చు."
మరునాటి నుండి కోడళ్లు కూడా నూతి దగ్గరకు చేరి వంతులు వేసుకుని నీళ్లు తోడసాగారు. నౌకరికి ఏంచెయ్యాలో తోచలేదు. "అమ్మా! నాకు సెలవిప్పించండి."
అని వెనుతిరగ్గా చిన్న కోడలు అడ్డుకొని అత్తగారితో " ఇతడిని ఉద్యోగం మానిపించవద్దు. షాపులో వేరే పని అప్పగిద్దాం!" అన్నది.
"చిన్నకోడలి మంచితనం"తెల్సుకుని అత్త చాలా సంతోషించింది.
చిన్న కోడలు ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడింది. "ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు.
పిండి విసురుతున్నారు. నీళ్లు తోడుతున్నారు. ఇక నేనేం చేయాలి? "ఒకనిర్ణయానికి వచ్చింది.
తరువాతిరోజు ఉదయాన్నే వంట
గది చేరుకుని అంట్లు ముందేసుకుని
బూడిద చేతిలోకి తీసుకుని మూల కూర్చున్నది. పనిమనిషి విస్తుపోయి అలాగే నిలబడిపోయింది. గబగబా అత్తగారు వచ్చింది.
"ఏమే! నా ముద్దుల కోడలా! ఇది మాత్రం నీకు తగదు.మనకుపనిచేసే
వాళ్లున్నారు.అంట్లు తోమడం వల్ల
నీ బట్టలు ఖరాబవుతాయి. నీ నగలు అరిగిపోతాయి." అని
సున్నితంగా మందలించింది. దానికి చిన్న కోడలు " అత్తయ్యా! నన్ను
కాస్సేపు మాట్లాడనివ్వండి. ఎంగిళ్లెత్తడంలో గొప్ప
మాహాత్మ్యము వున్నది. మీరు మహాభారతం లో కథ వినలేదో! పాండవులు రాజసూయాగం చేస్తూ శ్రీకృష్ణుణ్ని ప్రధమంగా పూజ చేసిన విషయం తెలుసు కదా! ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరియెంగిలి
విస్తళ్లు ఎత్తేపని చేసాడు తెలుసా! ఎంగిళ్లెత్తటమనేది ఎంత మహిమా
న్వితం కాకపోతే భగవంతుడీ పనెందుకు చేస్తాడు?"
తర్వాత రోజు అత్తవచ్చి వంటింట్లో
తిష్ట వేసి అంట్లు ముందేసుకుంది. ఈ వింత చూసి కోడళ్లందరూ చుట్టు
ముట్టారు. వెంటనే చిన్న కోడలు
" అత్తయ్యా! ఇలా నా పని మీరు తీసుకోవడం సమంజసం కాదు. ఇదిగో! ఈ పళ్లెం, చిన్న గ్లాసుపై నాకే
హక్కు వున్నది. ఎందుచేతనంటే -
ఇవి నా పతిదేవుడివి. కనుక వీటిని
నేను తోముతాను." అంది. దానికి
అత్తగారు " వెళ్లు వెళ్లు! వీడు ముందు నా కొడుకు, తర్వాతనే నీకు భర్త అయ్యాడు.కాబట్టి వీటిని నేనే తోముతాను." ఈ విధంగా అని గబగబా అంట్లు తోమసాగింది. ఇది చూసి కోడళ్లందరూ కూర్చుని వాళ్లూ అంట్లు కడగడం ప్రారంభించారు.
" ఇప్పుడు నేనేంచెయ్యను? అని చిన్న కోడలు ఆలోచనలో పడింది. రోజూ ఉదయం ఇల్లు తుడవడానికి
నౌకరు వస్తూంటాడు కదా!అనుకుని
వేకువకాగానే లేచి చీపురు పట్టింది. నౌకరు వచ్చేముందుగానే
గదులన్నీ ఊడ్చిపారేసింది. అత్త
గారిది చూసి " చిన్న కోడలా! ఇల్లు
నువ్వు తుడిచావేమిటి? అని అడగ్గా కోడలు-
" అత్తయ్యా! మీరు కాస్సేపు ఊరుకోండి. మారు మాట్లాడకండి. మీరు మాట్లాడారంటే నా చేతిలో
పనిపోతుంది అని ఇంకా ఇలా అన్నది.
"మీరు రామాయణం వినలేదా! అడివిలో గొప్ప గొప్ప ఋషులు,
మునులు వుండగా శ్రీరాముడు వారి కుటీరాలకు వెళ్లకుండా ముందుగా శబరి కుటీరానికే వెళ్లాడు. ఎందుకో తెలుసాండీ ?శబరి రోజూ పంపాసరో
వరానికివెళ్లే దారిలో రాళ్లూరప్పలని తొలగించి ఋషులకు దారిఏర్పాటు
చేసి వారికి సేవలు చేసేది. ఈ సేవలో గొప్ప మహిమ వున్నది. "
మర్నాటినుండి కోడళ్లందరూ చీపుర్లు పట్టారు. ఈ విధంగా ఇంటి స్వభావం పూర్తిగా మారిపోయింది. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి
పనుల్లో వారు మునిగిపోతున్నారు.
శుభ్రంగా గదులు తుడుస్తున్నారు. నీళ్లు తోడుతున్నారు. అంట్లు
శుభ్రపరుస్తున్నారు.వంటలు వండు కుంటున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతున్నాయి. కోడళ్లందరూ అన్యోన్యంగా ఉంటున్నారు.
అత్తామామలను గౌరవంగా చూసు
కుంటున్నారు. దుబారా ఖర్చులు తగ్గిపోయాయి. యజమాని వ్యాపారంలో లాభం పెరిగింది. వెంటనే మామగారు కోడళ్లందరికీ
నగలు చేయించారు.
ఒకరోజు చిన్న కోడలు తనకు మామగారిచ్చిన నగలు తీసుకుని పెద్ద కోడలు వుంటున్న గదిలోనికి వెళుతూండగా అత్త చూసింది.
చిన్న కోడలు పెద్ద కోడలితో ఇలా అంటున్నది.
" అక్కా! మీకు ఆడపిల్లలు వున్నారు. వారు పెరుగుతున్నారు. రేపో,మాపో వారికి పెళ్లిళ్లు చేయాలి.
నాకైతే ఇంకా పిల్లలు లేరు.అందు
వల్ల ఈ నగలు నేనేం చేసుకోను? మా అమ్మానాన్న నాకు నగలు బాగానే పెట్టారు. అవన్నీ నాదగ్గర ఇనప్పెట్టెలో పడి వున్నాయి. కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో! పిల్లల పెళ్లిళ్లకి అక్కరకొస్తాయి." అని ఆమె చేతిలో పెట్టింది. గుమ్మం బయట
నుండి ఇదంతా గమనిస్తున్న అత్త
ఒక్కసారిగా చలించి పోయింది.
కొసమెరుపు: ఉపన్యాసాలు చెప్పడం వేరు. ఆచరణలో చూపడం వేరు.ఈకొత్త కోడలు తాను చెప్పినది
ఆచరణ చేసి చూపించింది. ఇంటిని సంస్కరణ బాటలోకి నడిపించింది.
(వివేక చూడామణి.) స్వామీజీ వ్రాసిన పుస్తకం నుండి సేకరణ)
Saturday, June 15, 2019
అత్తారింటికి దారేది?
ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా సన్నాటంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది.
యమున నది తీరన్న వున్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది యేడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి, “ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా యేడుస్తోంది” అనుకున్నాడు. యెంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు.
మరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి, “మీలో యెవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా?” అని అడిగారు.
సభికులు తెల్లబోయి, సమధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు.
బీర్బల్ ముందుకొచ్చి, “మహారాజా, ఒక సారి వింటే కాని నేను చెప్పలేను” అని అన్నాడు.
అక్బర్ వెంతనే బీర్బల్ను ఆ రాత్రి అంతహ్పురానికి రమ్మని ఆహ్వానించాడు.
రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమ్నునా నది హోరును విన్నాడు.
విషయమర్ధమయ్యింది.
“మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని, పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఖంతో యేడుస్తోంది.” అని మరునాడు సభలో విశ్లేషించాడు.
సభికలందరూ ఈ విషయం విని బిగపట్టిన ఊపిరి వదిలారు.
Monday, April 30, 2018
స్వభావానికి తగ్గ వృత్తి
ఒక రోజు అక్బర్ మహారాజు తన సభలో, “మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు” అని అన్నారు.
అది బీర్బల్ ఒప్పుకో లేదు. మనిషి వృత్తికీ స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు.
అక్బర్ కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివి తేటలు, మేధస్సు మీద చాలా నమక్కం. కాని, అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా.
అందుకనే మనిషి వృత్తి కి, స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే, అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు.
“సరే, రేపు ఇద్దరం మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేద్దాము, ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చోపిస్తాను!” అని బీర్బల్ ఒప్పుకున్నాడు.
అనుకున్న ప్రకారం మొన్నాడు ఇద్దరూ మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేసారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు.
బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి, మిఠాయిలు అమ్ముకుని అతని దగ్గిరకి వెళ్లి, “మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టు లోంచి ఏమైనా ఇప్పించండి!” అని నాటకం ఆడాడు.
మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు చీదరించుకుని, “ఛీ! ఛీ! ధందా చేసుకునే టైం లో ఈ గోలేంటి! నిన్ను చూసి కొనే వాళ్ళు కూడా రారు! పొ! పొ!” అని చికాకుగా ధుత్కరించాడు.
బీర్బల్ ఊరుకో కొండా, చాలా ఆకలి వేస్తోంది అని బ్రతిమాలాడు.
మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుభండారాలు పెట్టుకుని కూడా ఏ మాత్రం చలించలేదు. సహాయకుల చేత బీర్బల్ ని మెడ బెట్టి కొట్టు బయటకు గెంటించాడు.
బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు.
ఒక బండలు కొట్టే మేస్త్రి కనిపించాడు.
అలాగే మారు వేషంలో ఇద్దరూ ఆ బండలు కొట్టే అతని దగ్గిరకు వెళ్ళారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు.
“అయ్యా! మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా?” అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు.
ఆ మేస్త్రి వెంటనే, “అయ్యో! అలాగా! నాతొ రండి.” అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు కడిగి, ఇంట్లోకి తీసుకుని వెళ్లి, ఉన్న కొంచంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించ మన్నాడు.
అతని భార్య కూడా అలాగే అన్నం, కూర, పచ్చడి, పులుసు, తయారు చేసి, రుచికరమైన భోజనం వడ్డించింది.
భోజనం అయ్యాక, కొంచం సేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు నీడలోకి లాగి అక్బర్, బీర్బల్ కి విసినికర్రలు ఇచ్చాడు.
ఇలా మర్యాదగా అతిథులు లాగా సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్, బీర్బల్ సెలవు తీసుకుంటుంటే, దారిలో తినడానికి కొంత తిను భండారం ఒక మూటలో కట్టి ఇచ్చాడు.
తిరిగి సభకు చేరాకా, బీర్బల్ అక్బర్తో, “ప్రభు! చూసారా! మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు, అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి సఖ్త హృదయము లేదు! మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా?” అని అడిగాడు.
అక్బర్ చిరు నవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నారు.
ఆపదలో వున్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి, అతని కుటుంబానికి బహుమూల్యమైన బహుమతులు పంపించి, కృతజ్ఞత తెలియ చేసుకున్నారు.
Subscribe to:
Posts (Atom)
-
పందికి పన్నీటి స్నానం పుష్కర దేశాన్ని ధనుంజయుడు పాలించేవాడు. అప్పటి వరకు ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. ఆ సంగతి తెలిసిన రా...
-
*ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువు...